ప్రజలకు మంచి చేస్తునట్టుగా కనిపించే ప్రభుత్వాలు, అవి సంకల్పించిన పథకాలు కొన్ని సందర్భాలలో ప్రజల జీవితాలను బాగు చేయడానికి బదులు వారి జీవితాలతో చెలగాటమాడుతాయి. అనుకున్నదొకటి జరిగింది వేరొకటి అన్నట్టుగా కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్ధన్ పథకం ఓ గ్రామంలో ఓ పేదవాడి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా విపత్తుల పాలు జేసింది, వారి ప్రశాంతమైన జీవితాలను ఏ విధఃగా అల్లకల్లోలం చేసిందీ అనే ఇతివృత్తంతో రూపొందిన చిత్రమే భీమదేవరపల్లి బ్రాంచ్ అనే తాజా చిత్రం.

యువదర్శకుడు రమేష్ చెప్పాల దర్శకత్వం లో కీర్తిలతబత్తిన, రాజా నరేంద్ర నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23వ తేదీన విడుదల కానుంది. ప్రముఖ చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పంపిణీ చేస్తున్న భీమ్దేవరపల్లి బ్రాంచి చిత్రం ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ, ఉత్కంఠభరితమైన మలుపులతో, ఎమోషనల్గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందింది.

చిత్రనిర్మాత కీర్తిలత ఈ చిత్రం గురించి చెబుతూ జరుగుతున్న సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్టుగా చెప్పారు. మా చిత్రం ద్వారా ప్రజలు కాస్తయినా జాగ్రత్త పడతారు, ప్రభుత్వ పథకాలు పేరిట ఎదుర్కొనబోతున్న సమస్యల సుడిగుండాలలో చిక్కుకుని జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకోకుండా పథకాల పట్ల పరిజ్ఞానం పెంచుకుంటారనే సదుద్దేశ్యంతోనే భీమదేవరపల్లి బ్రాంచి చిత్రం నిర్మించానని చెప్పారు.

దర్శకుడు రమేష్ చెప్పాల ఈ సినిమా పేపర్లో వచ్చిన ఒక వార్తను చదివి ప్రభావితమై వినోదాంశాలతో మేళవించి, ప్రభుత్వపథకాల రూపంలో ఎదురయ్యే విపత్కర పరిస్థితులను కళ్ళకు కట్టినట్టు చూపించడానికే సాధ్యమైనంత వరకూ ప్రయత్నించానని, ప్రేక్షకులు ఈ చిత్రం ద్వారా పథకాల వెనుక జరుగుతున్న అవకతవకలను తెలుసుకుంటారనే సంకల్పంతోనే భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాని తెరకెక్కించానని తెలియజేశారు.

బలగం చిత్రంలో నటించి పాప్యులారిటీ సాధించిన కొందరు నటీనటులు, అభిరామ్, రూప శ్రీనివాస్ హీరో హీరోయిన్స్ గా మరికొందరి కొత్తనటులు తో భీమదేవరపల్లి బ్రాంచ్ నిర్మించబడి అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందిందని నిర్మాతలలో ఒకరైన రాజా నరేంద్ర కూడా సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇటీవలే వరంగల్ జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్తో భీమ్దేవరపల్లి బ్రాంచ్ చిత్రానికి ఊహించని క్రేజ్ వచ్చింది.

ఈ భీమ్దేవరపల్లి బ్రాంచ్ చిత్రం జూన్ 23 న గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది.